నదుల ప్రాశస్త్యము


 

భారతదేశం ఎన్నో పుణ్యనదులు, తీర్ధాలకు నిలయం. ఇవన్నీ భక్తి శ్రద్ధలతో, విశ్వాసంతో స్నానమాచరిస్తే అనంత పుణ్యాన్ని, అత్మతత్వాన్ని ప్రసాదింపజేసి పునర్జన్మరాహిత్యాన్ని కలిగిస్తాయి.

భారతదేశం ఖండాంతరాల్లో పెరుగాదించడానికి మూలకారణం ఈ దేశం యొక్క నగ-నన-నదీ-తీర్థ కలయికతో గూడిన ప్రకృతి.

ఋగ్వేదంలో నదుల మహిమల గురించి ఇలా చెప్పారు. “గంగానదీ తీరమున దానం చేయటంవల్ల మానవుడు పరితాత్ముడౌతాడు. సరస్వతీ మొదలగు ప్రఖ్యాతాలైన పుణ్యనదీతీరముల యందు యజ్ఞాది వైదికకర్మలను ఆచరించుట చాలా మంచిది. సరస్వతీనది శ్రేష్ఠమైన తల్లిగా సంబోధింపబడింది".

నదిలో కొన్ని పవిత్ర స్థలాలున్నాయి. తైత్తిరీయ సంహిత ఇలా చెప్పింది –

తీర్థే, స్నాయి తీర్థమేవ సమానానాంభవతి

నదులన్నీ దైవతాలుగా ప్రస్తావింపబడ్డాయి. సరస్వతీ నది సర్వోత్తమమైన నదీదేవత.

మన దైనందినజీవితంలో శ్రౌత, స్మార్తాది కర్మలలోని కలశారాధనలో నదులపేర్లను ఈ విధంగా స్మరిస్తాం.

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి,

నర్మదే సింధు కావేరి, జలే స్మిన్ సన్నిధం కురు ||

“దివ్యములైన ఈ జలాలు మంగళకరాలైన మా అభీష్టమును తీర్చుగాక! మాకు త్రాగుటకు అనువైన నీటిని ఇచ్చుగాక! మావైపు ప్రవహించు గాక!” ఇవి జలవైశిష్ట్యాన్ని సంపూర్ణంగా అర్థంచేసుకున్న వేదఋషులు త్రికరణశుద్ధిగా జలదేవతను ప్రార్థించిన మంత్రం యొక్క భావం.

ఇంటిలో స్నానం చేస్తున్నా కూడా “గంగేచ యమునే కృష్ణేగోదావరి సరస్వతి" అంటూ ఆ నదులను స్మరిస్తూ చేసే స్నానం వల్ల వచ్చే ఫలాలను అర్షులు ఇలా చెప్పారు.

  1. నదీస్నానం చేస్తే శారీరకంగా కనబడే మాలిన్యం పోతుంది.
  2. నిండు ప్రవాహమున్ననదిలో స్నానం చేయడంవల్ల శరీర మంతటికీ సుఖస్పర్శ కలిగి శరీరంలో ఉష్ణాధిక్యత తగ్గుతుంది.
  3. నడీనీటిలోని చల్లదనం ఇంద్రియతాపాలను తగ్గించి మనస్సుకూ, వాక్కుకూ శుచిత్వాన్ని కలిగిస్తుంది. కర్మానుష్ఠాన యోగ్యత సిద్ధిస్తుంది.
  4. పుణ్యనదీతీర్థాల్లో చేసే స్నానం మనసుకు ఏకాగ్రతనిస్తుంది.
  5. తీర్థమందు స్నానం చేసినవాడు తనకు సంబంధించిన వారిలో చాలా శ్రేష్ఠమైన వాడవుతాడు.
  6. మహర్షుల యొక్క దీక్షా, తపస్సుల విశేషాలు, శక్తి నదీ జలాల్లో ఉన్నవని వేదం నిర్దేశించింది. కావున నదీస్నానంచే వాటిని మనము స్వీకరించి పవిత్రులమౌతాం.

అందుచేతే నదీజల స్నానం సర్వథా, సర్వదా యోగ్యమని అర్షుల వాక్కు.

భారతదేశంలో పుణ్యనదులకు కొరతేలేదు. పుట్టింది మొదలు మానవులు చేసే పాపాలు విశిష్టదినాల్లో అనగా – పుష్కర సమయంలో, గ్రహణ సమయాల్లోను, మకర సంక్రమణ సమయంలో, కార్తీక, మాఘమాసాల్లో నదీ స్నాన మాచారిస్తే త్రికరణశుద్ధిగా పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి.

  • గంగానదీ స్నానం అరవైయోజనాల పవిత్ర ప్రదేశం. అరవై పాపాలు హరించే పుణ్యమూర్తి. గంగాద్వారా స్నానఫలం దీనికి రెట్టింపు.
  • యమునానదీ తీరం ఇరువది యోజనాలు విస్తరించి, ఇరవై రకాల పాపాలు పరిహరిస్తుంది.
  • సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించి ఇరవైనాలుగు యోజనాలు విస్తరించిన ఈ నది ఇరవై పాపాలు పోగొడుతుంది.
  • వరుణ, కుశావర్త; శతద్రువు; విపాశక; శరావతి; వితస్త; ఆశిక్ని; మధుమతి; ఘ్రుతవతి; మొదలిఅన నదీతీరాల్ సందర్శనం శుభప్రదం. దేవనడిగా ప్రఖ్యాతమైన ఆ నదీ పరీవాహక ప్రాంతం పదియోజనాలు విస్తరించి; పదిహేను రకాల పాపాలను పోగొడుతుంది. రేవానదీ స్నానం బ్రహ్మ హత్యాపాతకాన్ని నాశనం చేస్తుంది. చంద్రభాగ, రేవతి, సరయు, గోమతి, కౌశిక, మందాకినీ, సహస్త్రవక్ర్త, పూర్ణ, పుణ్య, బాహుదాలనే నదులు పదహారు యోజనాలు విస్తరించాయి. నదీ సంగమ ప్రదేశాల్లో చేసే స్నానం, సంధ్యాదికాలు అనంత పుణ్యఫలాలనిస్తాయి.
  • గోదావరీతీరం ఆరు యోజనాలు విస్తరించి ఉంది. ఒక్కసారి గోదావరి తీరం చుట్టి వచ్చినవారికి “వాజపేయ” యాగ ఫలం లభిస్తుంది.
  • భీమేశ్వరం, వంజర సంగమస్థానాలు ప్రయాగాతో సమానం. ద్వాదశ యోజనాలు విస్తరించిన కుశస్థలీనది ముప్ఫై ఆరు పాపాలను, పూర్ణానది యాత్ర ముప్ఫై పాపాలను, కృష్ణవేణి పదిహేను పాపాలను, తుంగభద్ర ఇరవైపాపాలను ప్రక్షాలనం చేస్తాయి.
  • పంపాసరోవర శక్తి అనంతం. పాండురంగా మాతులింగ, గంధర్వ నగరాలు తీర్థాలతో విలసిల్లుతున్నాయి. రామేశ్వరంలో 108 తీర్థాలు, ఆదివరాహక్షేత్రమైన తిరుమలలో దాదాపు 18 తీర్థాలు ఉన్నాయి. ఈ తీర్థాలలో స్నానమాచరిస్తే పాపాలు తొలగి పుణ్యఫలం కలుగుతుంది.
  • మహానది, తామ్రపర్ణి నదుల పుణ్యం వర్ణశక్యముకాదు. కుంభకోణంలో స్నానం సమస్త తీర్థాల సమానం.

కొన్ని సమయాల్లో నదులు, తీర్థాలలో స్నానమాచరించటం నిషేధించటం జరిగింది. రవి కర్కాటకంలో ఉన్న సంక్రమణ సమయం రెండుమాసాలు నదీ రజస్వల సమయం. ఆ సమయంలో నదీస్నానం దోషం. నదీ తీరప్రాంత వాసులకు ఈ దోషముండదు.

నదీ రజస్వల అంటే, కొత్తనీరు రావటమన్న మాట. అప్పుడు స్నానం చేయడం, మహాదోషం. తీర్థసేవన విషయంలో ఇది సాధారణ విషయమైనా, ఈ సమయంలో తీర్థ దర్శనం చేయవలసివస్తే స్నాన, క్షౌర, ఉపవాసాదులు ఆచరించాలి. కాబట్టి “జాగ్రత్త" అని హెచ్చరించారు.

ప్రతి నదీ పాపహారిణే, పుణ్యమూర్తే. నది స్త్రీ రూపం. అందుకే స్త్రీలు పసుపు, కుంకుమ, పువ్వులతో విశేషంగా నదిని పూజిస్తారు.

ప్రతి జీవనడికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. జీవన ప్రదాతలైన నదులకు కృతజ్ఞత  చెప్పటం పుష్కరాల ప్రధానోద్దేశం. పెద్దలకు పిండ ప్రదానం చేసి పితృఋణం తీర్చుకోవటం ఒక ధార్మిక, సాంస్కృతిక ప్రయోజనం.

మేషం మొదలైన పన్నెండు రాశులలో బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కో సంవత్సరం ఉంటాడు. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినపుడు గోదావరి నది పుష్కరాలు వస్తాయి. అలాగే కన్యారాశిలో బృహస్పతి ప్రవేశించినపుడు కృష్ణానదికీ పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయంలో నదీస్నానం చేస్తే వెయ్యి గోదానాలు చేసిన పుణ్యం లభిస్తుంది.

Leave a comment